ఏడుచేపల కధలో చక్కటి అంతరార్ధం!


 మన పురాణాల్లో ఉన్న కధలలోనే కాదు, మన పెద్దలు చెప్పిన కధల్లో, సామెతల్లో కూడా ఎంతో లోగుట్టు ఉంటుందని అంటారు కదా! మరి ఈ ఏడుచేపల కధలో కూడా ఏదైనా మర్మముందా? అందులో కూడా చక్కటి అంతరార్ధం ఉంది.

అనగనగా  ఓ రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఎండలో పెట్టారు. అందులో ఓ చేప ఎండలేదు. ఇక ప్రశ్నలు మొదలయ్యాయి... 
చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డువచ్చింది. గడ్డిమోపా గడ్డిమోపా ఎందుకు అడ్డువచ్చావు? ఆవు మేయలేదు. ఆవా ఆవా ఎందుకు గడ్డిని మేయలేదు? పాలేరు తాడు విప్పలేదు.
పాలేరా పాలేరా తాడు ఎందుకు విప్పలేదు? అవ్వ బువ్వ పెట్టలేదు. అవ్వా అవ్వా బువ్వ ఎందుకు పెట్టలేదు? పిల్లవాడు ఏడుస్తున్నాడు. పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావు? చీమ కుట్టింది.
చీమా చీమా ఎందుకు కుట్టావు? నా బంగారుపుట్టలో చేయిపెడితే కుట్టనా? ఇది అత్తమ్మ చెప్పిన కధ. దీనికి మాస్టారుగారు ఇచ్చిన వివరణ -
 ఈ కధలో రాజు అనగా ఓ సాధకుడు. ఆ సాధకుని దేహంలో వున్న ఏడు చక్రాలు (మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారం) ఏడుగురు కొడుకులు.  ఆ ఏడుగురు కొడుకులు వేటకి అంటే ధ్యానస్థితికి వెళ్ళిరి. ఏడు చేపలు తెచ్చారనగా తన ధ్యానంకు అవరోధమైన మనస్సు, అరిషడ్వర్గములు అని తెలుసుకున్నారు. సాధన అనే ఎండలో ఈ ఏడింటిని ఎండబెట్టారు. అందులో మనస్సనే చేప ఎండలేదు. ఎందుకెండలేదన్న విచారణ ప్రారంభమైంది. మనసా, మనసా ఎందుకు ఎండలేదు? అవివేకం అడ్డు వచ్చింది.

అవివేకమా, అవివేకమా ఎందుకు అడ్డువచ్చావు? వివేకం మేయలేదు. వివేకమా, వివేకమా ఎందుకు మేయలేదు?బుద్ధీ అనబడే పాలేరు మాయనే తాడుని విప్పలేదు. బుద్ధీ, బుద్ధీ ఎందుకు విప్పలేదు? భక్తీ అనబడే అవ్వ జ్ఞానమనబడే బువ్వని పెట్టలేదు. భక్తీ, భక్తీ ఎందుకు బువ్వ పెట్టలేదు? ప్రాపంచిక బంధాలు ఏడిపిస్తున్నాయి. ప్రాపంచిక బంధాలూ, ప్రాపంచిక బందాలు ఎందుకు ఏడిపిస్తున్నారు? వైరాగ్యం కుట్టింది.వైరాగ్యమా, వైరాగ్యమా ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో చేయి పెడితే కుట్టనా?

ఇప్పుడు ఈ కధను చివరనుండి మొదటకి జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలంటూ మాస్టారుగారు ఇలా వివరించారు - పుట్ట అంటే వ్యక్తి దేహమని అర్ధం. నేలమీద కూర్చున్నప్పుడు దేహం ఎలా క్రింద విశాలంగా ఉంటుందో, పైకి పోనూ పోనూ ఎలా దేహం సన్నగా ఉంటుందో పుట్ట కూడా అదే మాదిరిగా క్రింద విశాలంగా, పైకి వెళ్తున్నకొలదీ సన్నగా ఉంటుంది. మానవదేహంలో నవరంద్రాలు ఎలా ఉంటాయో పుట్టకు కూడా ఎన్నో రంద్రాలు ఉంటాయి. ప్రతీ మనిషికీ ఎప్పుడో ఒకప్పుడు ఏమిటీ జన్మ అని అన్పిస్తుంది. అలా అన్పించినప్పుడు కొందరిలో ఆధ్యాత్మిక జిజ్ఞాస కల్గి అంతర్ముఖం అవుతారు. పుట్టలో చేయి పెట్టడమంటే ఆధ్యాత్మిక జిజ్ఞాసతో అంతర్ముఖం కావడం. అలా అంతర్ముఖం కావడం వైరాగ్యమనే చీమ కుట్టినప్పుడు కల్గుతుంది. వైరాగ్యం కల్గినప్పుడు ప్రాపంచిక బందాలు ఎంత దుఃఖపూరితమో గ్రహిస్తాడు. భక్తి  జ్ఞానమనే బువ్వని పెడుతుందని గ్రహించి బుద్ధితో మాయ అనే తాడుని విప్పుకుంటాడు. అప్పుడు వివేకం కల్గి అవివేకమనే అడ్డుని తప్పిస్తుంది. అప్పుడు అరిషడ్వర్గాలుతో పాటు మనస్సు కూడా ఎండి అంటే నశించి ధ్యానం బాగా కుదిరి కుండలినీశక్తితో సప్తచక్రాలు అధిరోహించిన సాధకుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. మానవుడే మాధవుడవుతాడు. 

No comments