బ్రహ్మకోసం 5 అవతారాలెత్తిన పరమశివుడు


పరమ శివుడు పంచావతారమూర్తి. విష్ణుమూర్తి లోక కల్యాణార్థం దశావతారాలలో కనిపించడం అందరికి తెలిసిన విషయమే. కానీ పరమ శివుడు బ్రహ్మ కోరికపై ఐదు అవతారాలు దాల్చిన విషయం కొందరికి మాత్రమే తెలుసు. ఈశ్వరుడు త్రిలోచనుడు, త్రిశూలి, ధవళ శరీరుడని మాత్రమే అందరకీ తెలుసు. అమృత మధనం సమయంలో గరళాన్ని త్రాగిన ఈశ్వరునికి గరళకంఠుడూ, నీల కంఠుడూ అని పేరు.

బ్రహ్మదేవుడు శ్వేతవరాహకల్పంలో పరమేశ్వరుని ధ్యానించి, తన విధులను నిర్వర్తించడానికి తగిన జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. అప్పుడు ఆయన గౌరీదేవీతో కూడిన సద్యోజాత శివరూపంతో ప్రత్యేక్షం కాగా, తనకు పుత్రప్రాప్తి కలగాలన్నారు. వెంటనే నలుగురు కుమారులు కలిగారు. మరలా రక్తకల్పంలో బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి ధ్యానించగా, ఆయన అగ్నిగోళాల వంటి ఎర్రటి కన్నులతో ప్రశాంత వదనంతో ప్రత్యేక్షమై జ్ఞానభిక్ష ప్రసాదించి నలుగురు కుమారులను అనుగ్రహించారు.

తరువాత పీతవాసకల్పంలో బ్రహ్మ ప్రార్థించగా శివుడు ఆజానుబాహునిలా ప్రత్యక్షమయ్యాడు. అదే మూడవ అవతారమైన తత్పురుషావతారం. శివ కల్పంలో సృష్టికార్యం ఎలా నిర్వర్తించాలన్న తరుణంలో మరలా బ్రహ్మ, శివుడిని పూజించగా నలుపురంగు తేజస్సులో అఘోరమూర్తిగా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. తరువాత వచ్చిన విశ్వకల్పంలో కూడా బ్రహ్మకు సమస్యలే వచ్చాయి. ఈసారి బ్రహ్మ శరీరం నుంచి ఓ మహానాదం, సరస్వతీ రూపావిర్భావం జరిగింది. పరమశివుడే ఇలా అవతరించాడు.

ఈశ్వరుని ఐదవ అవతారం అన్ని అవతారాలకన్నా విశిష్టమైనది. ఇలా ఐదు సందర్భాల్లో ఐదు అవతారాల్లోనూ బ్రహ్మ సృష్టి నిర్మాణ సౌలభ్యానికి, ముల్లోకముల హితానికే ముక్కంటి అనుగ్రహించినట్లు శతరుద్ర సంహిత చెబుతోంది.

No comments